Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Tuesday, August 9, 2011

చిన్ననాటి జ్ఞాపకాలు

ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.

రాత్రి కిచెన్ లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది .లిఫ్ట్ చెయ్యగానే లతా బావున్నారామ్మా నేను రాముని అన్నారు.ఒక్కక్షణం లైట్ వెలగలేదు.ఎవరండి అన్నాను సంకోచంగా.నేనమ్మా మీతో కలిసి చదువుకున్నాను తెలుగు మాస్టారు శాస్త్రిగారబ్బాయిని అన్నారు.అప్పుడు గుర్తొచ్చింది ఆ మధ్య రాము వచ్చాడు నెంబర్ తీసుకున్నాడు అని అమ్మ చెప్పిన సంగతి.కుశలప్రశ్నలయ్యాక  ఈమధ్య తను కలిసిన కొందరి విషయాలు చెప్పారు అందరం ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అన్నారు.సరే ట్రై చెయ్యండి అంతా దొరకాలి కదా అన్నాను.ఫోన్ అయితే పెట్టేసాను కానీ మనసు మాత్రం రివ్వుమని స్కూల్ రోజుల్లోకి ఎగిరిపోయింది.

ఎంత బావుంటాయో చిన్ననాటి  ఆ రోజులు.జిల్లాపరిషత్ స్కూల్ అయినా మా స్కూల్ కి చాలా పేరుండేది. టీచింగ్ చాలా బావుండేది.నాన్నగారు కూడా అదే స్కూల్ లో వర్క్ చేసేవారు.
వాణి,లక్ష్మి,ప్రసన్న,నాగమణి.శైలజ,సాయి,గోవర్ధన అందరం ఒక బృందం.

వాణి స్వరం కంచుగంటలా వినిపించేది.అయిగిరినందిని,బ్రహ్మమురారి సురార్చిత లింగం ఈ రెండుపాటలు హై పిచ్ లో తను పాడుతుంటే క్లాస్ అంతా మంత్రముగ్ధుల్లా వినేవారు.
లక్ష్మి సాఫ్ట్ గా ఉండేది.మల్లెలు ,జాజులు,డిశంబరాలు,కనకాంబరాలు ఎవైనా సరే తన ముందు పెడితే నిమిషాల్లో వత్తుగా,లావుగా మాల తయారై పోయేది
సాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకునేది.వాళ్ళ మామయ్యనే చేసుకుని ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటోంది,ఆ ఇంట్లో ఉసిరిచెట్టు ఉండేది.చిట్టి చిట్టి ఉసిరికాయలు భలే తినేవాళ్ళం.
నాగమణి,తనకి పొట్లకాయలంటే ఎంత చీదరో.వాళ్ళ దొడ్లోనేమో విరగకాసేవి.అందరికీ పంచమని వాళ్ళ అమ్మగారు తనకే చెప్పేవారు.వాటిని అంటుకోకుండా రెండు న్యూస్ పేపర్స్ లో చుట్టి ఎడంగా పట్టుకుని ఇచ్చి వచ్చేది.
శైలజకి చదువంటే ఎంత ప్రాణమో. లక్షల ఆస్తికి వారసురాలు కావడంతో పెద్దవాళ్ళు సెవెంత్ లోనే పెళ్లి చేసేసారు.టెన్త్ లో సరిగ్గా  మొదటి పరిక్ష రోజే పాప పుట్టి చదువు ఆగిపోయింది.ఆ కసితోనేమో పిల్లలు ముగ్గుర్ని బాగా చదివించింది.
ప్రసన్న ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.మేమిద్దరం టెన్త్ తరువాత కూడా ఇంటర్ స్టెల్లా కాలేజ్ కి కలిసే వెళ్ళేవాళ్ళం తరువాత దారులు వేరై వివరాలు తెలియదు.గోవర్ధన కూడా ఆ ఊళ్ళో అబ్బాయినే చేసుకుని అక్కడే ఉంది.
ఒక్కసారి మళ్లీ అందరం కలిస్తే...ఆ ఊహే అందంగా ఉంది.

ప్రతి ఏడూ టెన్నికాయిట్ టోర్నమెంట్స్ కి స్కూల్ తరపున వెళ్లి ఆడి వచ్చేవాళ్ళం. విజయవాడ రేడియోస్టేషన్ కి వెళ్లి వివిధభారతిలో క్విజ్ లో పాల్గొని కప్పు గెలుచుకోడం ఓ గొప్ప అనుభూతి.ఆ ప్రోగ్రాం కోసం పెనమలూరు స్కూల్ నుండి వచ్చి పరిచయమై ఆ తరువాత ఇంటర్, డిగ్రీ కలిసి చదువుకున్న శ్రీదేవి, ఇంటర్ తరువాత మాతో కలిసిన సునీత నాకు ప్రాణ స్నేహితులు.ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటాము.

ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ తెచ్చుకుని ప్రైజ్ తీసుకోడం నా చదువుకి సంబంధించి మర్చిపోలేని జ్ఞాపకం.బాచ్ వైజ్ గా టెన్త్ క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నవారి లిస్టు లో నా పేరు బోర్డుమీద పెయింట్ చేసి ఉంటుంది.చిన్నప్పుడు నాన్నగారితో స్కూల్ కి వెళ్ళినప్పుడు  అది చూసి మా అబ్బాయి ఎంత మురిసిపోయాడో.ఇప్పటికీ టీచర్స్ అంటారు నాన్నగారితో లత ఏ ఇంజినీరింగో చేసి మంచి జాబ్ లో ఉంటుంది అనుకున్నాము అని. హు.డెస్టినీ డిసైడ్స్ అంతే చివరికి విధిచేయు వింతలన్నీ అని పాడుకోడం మాత్రం మిగిలింది.

ఒక్క ఫోన్ కాల్ ఎన్ని జ్ఞాపకాలను తట్టిలేపిందో. వాటిని పదిలపరచుకునే ప్రయత్నమే ఇది.

Monday, July 11, 2011

పేలాల పండుగ



 ఈ రోజు  తొలి ఏకాదశి. ఈ పండగగా కంటే పేలాల పండగగానే అందరికీ గుర్తు ఏమో.ఎందుకంటే ఈ రోజు తప్పకుండా పేలాలపిండి తినిపించేవారు చిన్నప్పుడు.
బహుశా దీనితోనే మనకు పండగలు మొదలవుతాయి అనుకుంటా.

తప్పనిసరిగా ఈనాటికీ  ఇల్లు దులుపుకుని,కడుగుకుని,ఈ రోజు తలంటుకుని పూజ చేస్తారు.చాలా సంవత్సరాల తరువాత ఇవ్వాళ్ళ నేను పేలాల పిండి చేశాను.ఇంట్లో మొక్కజొన్నలు ఉండడంతో వాటిని పాప్ కార్న్ చేసి,బెల్లం కలిపి గ్రైండ్ చేస్తే పిండి రెడీ అయ్యింది.ఇన్నేళ్ళ తరువాత ఆ టేస్ట్ ఎంత  నచ్చుతుందో చూడాలి.అసలు ఇప్పటి తరం వాళ్లకి ఇది తెలియదేమో కూడా.

ఇది చేస్తుంటే ఒక సంగతి గుర్తొచ్చింది,చాలా చిన్నపుడు ఇది తింటుంటే చింది ఒళ్ళంతా పడేది.ఎందుకలా జరిగేదో నా చిన్నిబుర్రకి అసలు అర్ధం అయ్యేది కాదు.ఆలోచించగా, చించగా తెలిసింది ఏమిటంటే శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరి వదులుతాము కదా.స్పూన్ నోటి దగ్గరకు వచ్చినప్పుడే నేను ఊపిరి వదిలేసరికి ఆ పొడి చింది పడేది అన్నమాట.ఒకసారి అది అర్ధం అయ్యాక నీట్ గా తినేదాన్ని అనుకోండి.అది వేరే సంగతి.కాకపోతే ఈ పేలాపిండి ఈ రోజే ఎందుకు తినాలో మాత్రం నాకూ తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

Saturday, April 16, 2011

మల్లెలవాన



వేసవి వచ్చిందంటే చాలు మల్లెల ఘుమఘుమలూ,మామిళ్ళ మధురిమలూ మనసులోకి వచ్చేస్తాయి వీటి కోసమైనా వేసవి కోసం ఎదురుచూడాలని అనిపిస్తుంది.మన ప్రమేయం లేకుండానే మల్లెలు పూసే వెన్నెల కాసే అంటూ మనసు పాటలు పాడుకుంటుంది.ఏడాదికోసారి మల్లెల వానలోతడిసి 
పోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.

అరవిచ్చిన మల్లెల్నిచూస్తే నాకు పూలజడ గుర్తొస్తుంది.అసలు ఆడపిల్లకీ పూలజడకి బోలెడు అనుబంధం ఉంటుంది ఎంత సరదా పడి  వేయించుకునే వాళ్ళమో చిన్నప్పుడు.సీజన్ మొదలైన దగ్గరనుండీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూపులు.పూలజడ బాగా  కుట్టే ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారు ముందు వాళ్ళ అప్పాయింట్ మెంట్ దొరకాలి.ఇక రేపు పూలజడ అంటే ఎంత సంబరమో.వాడుకగా పూలు తెచ్చే అతనికి మంచి మొగ్గలు తెమ్మని చెప్పేది అమ్మ.ఉదయమే తలంటు పోసుకుని,ఆరాక చిక్కు తీసి పిల్లకుప్పెలు పెట్టి జడ వేసుకునేదాన్ని.సవరం కూడా అక్కరలేదండోయ్  నిజ్జంగా అంత పెద్ద జుట్టు ఉండేది నాకు.ఏ మూడు గంటలకో పూలు రాగానే హడావుడి మొదలయ్యేది 

మంచి మొగ్గలు అన్నీ ఏరి పొడవుగా ఉన్న పుల్లలకి గుచ్చి రెడీ చేసేవారు.
జడకు రెండువైపులా రెండు చొప్పున పెట్టి పైనుండి కిందవరకూ  టాకాలు వేసి కుట్టేవారు. వాటిమధ్య గాప్ నింపడానికి మల్లెలూ,అక్కడక్కడా అందం కోసం కనకంబరాలూ,మరువం వేసి చివరి వరకూ కుట్టేవాళ్ళు.ఆఖరికి పైన ముద్దగా మల్లెచెండూ,మళ్ళీ కదంబమాల,మల్లెల మాల ఇలా పేర్చి అన్నివైపులా కుట్టడంతో జడ పూర్తయ్యేది అప్పటివరకూ వంచిన తలఎత్తితే ఒట్టు 

అప్పుడు ఫ్రెష్ అయ్యి పట్టులంగా వేసుకుని నగలు పెట్టుకుని ముస్తాబు అయ్యేసరికి స్నేహితులు కూడా రెడీ అయ్యి వచ్చేసేవారు.ఈ లోగా ఏదమ్మా జడ చూపించు అంటూ ఇరుగుపొరుగుల కేకలు మనం ఏమో మహరాణిలా వెళ్లి అందరికీ జడ చూపించి రావడం,ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది కానీ అప్పుడు సహజంగా ఆలా జరిగిపోయేవి. ఈలోగా ఊళ్ళో ఉన్న ఒక్క ఫోటో స్టూడియో అతన్నీ తీసుకొస్తే అద్దం ముందు మనం,అద్దంలో జడతో ఫోటో దిగడంతో ఒక ఘట్టం పూర్తయ్యేది 

ఇక అసలు కధ అప్పుడు మొదలయ్యేది ఎక్కడ జడ నలిగిపోతుందో అని కూర్చోవాలన్నా,పడుకోవాలన్నా భయం.అమ్మ చేత అన్నం తినిపించుకుని,జాగ్రత్తగా పక్క చేరి తెల్లవార్లూ బోర్లా పడుకోవడమే కదిలితే ఒట్టు తెల్లవారేసరికి మొగ్గలు విచ్చి ఇంకా అందంగా ఉండేది.ఇక ఆ రోజు మోయగలిగినంత సేపు ఉంచుకుని,మల్లెలు వాడుతుంటే అప్పుడు మెల్లగా ఊడదీస్తే పూలజడ ప్రహసనం పూర్తయ్యేది.మళ్లీ తలంటుకునే వరకూ జుట్టు మల్లెల పరిమళంతో గుబాళిస్తూ ఉండేది.ఒకోసారి సీజన్ అయ్యేముందు ఇంకోసారి  వేయించుకునే వాళ్ళం.అలా ఏటా సాగిన పూలజడ ముచ్చటకి పెళ్ళినాడు వేసుకోవడంతో ఫుల్ స్టాప్ పడిపోయింది 

ఇప్పుడు మూరమల్లెలు కొనుక్కుంటే తలలో నిలుస్తాయో లేదో అనుమానమే. 
ఏం చేస్తాం ఆ తీపి గుర్తులని తలచుకుని మురిసిపోడం తప్ప    

Monday, March 28, 2011

మనసుకి నేస్తాలు

చాలా చాలా రోజులు ఊహూ సంవత్సరాల తరువాత నిన్న వెన్నెల్లో ఆడపిల్ల నవల చదివాను.ఆ రోజుల్లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ నవల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు.కానీ నాకు ఇప్పటికీ గుర్తు మొదటిసారి ఈ నవల చదివాక ఆఖరి పేజీ అయ్యేసరికి కళ్ళనిండా నీళ్ళతో మనసు భారమై చాలా సేపు అలాగే కూర్చున్నాను.ఇన్నేళ్ళ తరువాత చదివినా అదే అనుభూతి మనసుని తాకి పూర్తయ్యేసరికి కళ్ళు చెమర్చాయి.

ఒక మంచి పుస్తకం చదివితే,ఒక మంచి పాట వింటే వచ్చే ఆనందం ఇవే కదా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉండేవి.  ఇంత చిన్న జీవితంలో ఎన్నని ఆస్వాదించగలం.అన్నీ కొంచెం కొంచెం చవిచూసేసరికే  జీవితం అయిపోతుంది అంటుంది రమ్య ఈ నవలలో.
నిజమేనేమో

అసలు పుస్తకాలుంటే ఏమీ అక్కర్లేదు.చిన్నప్పుడు పరిక్షలు అయిపోయి సెలవులు వచ్చాయంటే చాలు అమ్మనడిగి  నవలల  లిస్టు  అంతా  రాసుకుని  రెడీ అయిపోవడమే.ఊళ్ళో లైబ్రరీ ఉండేది రోజూ రెండు నవలలు ఇచ్చేవాళ్ళు.ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్లి తెచ్చేసుకుంటే మరునాటికి  చదివేయ్యాలి.అదే కార్యక్రమం.అంతా నిద్రపోయాక,వేసవిలో ఆరుబయట పడుకుని వెన్నెల్లో పుస్తకం చదువుకుంటే వచ్చే అనుభూతి మర్చిపోగలమా.
అలా దాదాపు అన్ని నవలలూ చదివేశాను.తిరిగి కాలేజ్ కి  వెళ్ళినప్పుడు లంచ్ టైం అంతా ఫ్రెండ్స్ తో ఇవే కబుర్లు.

ఆ అలవాటే ఇప్పటికీ ఉన్నా,ఇక్కడ లైబ్రరీ దగ్గరలో లేక నవలలు దొరక్క చదవడం కుదరడం లేదు.కానీ వీక్లీస్ మాత్రం మానలేదు.లెండింగ్ లైబ్రరీకి మెంబర్షిప్ కట్టి రోజూ ఒక వీక్లీ తీసుకుంటాను.

ఈ మధ్యే తెలిసింది ఈవెనింగ్ అవర్ అని లైబ్రరీలో బుక్స్ వారానికి రెండు రెంట్ కి ఇస్తారు అని మరి మా ఏరియాకి హోం డెలివెరీ ఉందొ లేదో కనుక్కోవాలి.ఉంటె మరోసారి అన్నీ పుస్తకాలూ చదవాలి ఎవరికైనా ఆసక్తి ఉంటే www.eveninghour.com చూడండి.



Tuesday, January 25, 2011

ఈ జ్ఞాపకాలు మధురం


ఇరవై మూడేళ్ళు.
కాలం ఎంత త్వరగా పరుగులు తీస్తుందో.నిన్నోమొన్నో జరిగినట్టు  అనిపించే సంఘటనలు అన్నీ జ్ఞాపకాలై మదిలో దోబూచులాడు తున్నాయి.
రధసప్తమి నాడు తెల్లవారు జామున ఈ ప్రపంచం లోకి రావడానికి తహతహలాడుతున్న నా బిడ్డని తలచుకుని ఎందుకో తెలియదు ఆ క్షణం నా మనసులో మెదిలింది 
కళ్యాణ రామునికి కౌసల్య లాలి,
యదువంశ విభునికి యశోద లాలి 
అంతలోనే చిరునవ్వు విరిసింది. ఆప్యాయంగా అనుకున్నాను నీ కోసం నేనెవరిని కాను కన్నా అని.లేత గులాబి  రంగు చెక్కిళ్ళు ,మూసి ఉన్న గుప్పెళ్ళు,చిట్టి చిట్టి పాదాలు ,ఆ లేలేత స్పర్స ,తొలిసారి తనని చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను.
పుట్టిన పది రోజులకే జబ్బు చేసి డాక్టర్ ఆయిల్ ఇంజెక్షన్స్ చేస్తుంటే భయంతో వాడు దక్కుతాడో లేదో అని చిగురాకులా వణికిపోయిన నా నిస్సహాయత ఇంకా నాకు గుర్తుంది.ఎలా అయితేనే అన్నీ తట్టుకుని వాడు పెరిగాడు 
మగపిల్లలు లేకపోవడంతో డాడీ ఎప్పుడూ అనేవారు వీణ్ణి ఇంజినీర్ ని చేసి నీకు అప్పచెప్తాను నాకు ఇచ్చేయ్యమ్మాఅని. పైకి నవ్వేసినా లోపల అమ్మో అనుకునేదాన్ని.
ఒక్కరోజు కూడా వదలకుండా అపురూపంగా పెంచుకున్నాను.తన బాల్యాన్నిఆస్వాదించాలి  అన్న కారణంతో 
ఉద్యోగం మాటే ఎత్తలేదు నేను.చాలా మెత్తని స్వభావం తనది.చాలా చిన్నప్పుడు కూడా చిన్న సన్నజాజి కొమ్మ ఇస్తే అరగంట ఆడుకునే వాడు.వాళ్ళ డాడీ కలర్ ఫుల్ గా ఉండే బుక్స్ తెస్తే చదువుకుని తన దిండు కింద పెట్టుకుని పడుకునేవాడు.చిన్నప్పుడు బజారు వెళ్తే చాలు అయిస్క్రీం షాప్ దగ్గర ఆగిపోయేవాడు.ఎంతగా అంటే మమ్మల్ని చూస్తూనే షాప్ అతను తనకి నచ్చే ఫ్లేవర్ కప్ తీసి బయటపెట్టేవాడు.
 hps లో  చదివించాలని  మావారికి కోరిక.ఫస్ట్ క్లాస్ కి ఎంట్రన్సు రాయించడానికి వచ్చాము.నాకు బాగా గుర్తు.పరిక్ష రాసాక ఏడుస్తూ వచ్చాడు.మాత్స్ బాగా చేశాను ఇంగ్లీష్ సరిగ్గా రాయలేదు అని.అంత సున్నితంగా ఉండేవాడు.సీట్ వస్తే తన చదువు కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము మేము .
సన్నగా ఎంత అమాయకంగా ఉండేవాడు అంటే అసలు పెద్దయ్యాక ఎలా బ్రతుకుతాడో ఈ లోకంలో అనుకునేదాన్ని.అలాంటిది ఒకసారి టెన్త్ క్లాస్ కి వచ్చి ఎక్స్పోజర్ వచ్చాక ఆటోమాటిక్ గా  ఆ మెచ్యూరిటీ వచ్చేసింది.చదువు పూర్తయ్యేసరికి  ఇంకా ఇండివిడ్యువలిటీ,డెసిషన్ మేకింగ్ వచ్చేసాయి. ఇంజినీరింగ్ కి రాష్ట్రం కానీ రాష్ట్రం హాస్టల్ కి వెళ్తోంటే ఎంత బాధ వేసిందో.ఇంక తరువాత అలవాటు అయిపోయింది అనుకోండి.జాబ్ చేస్తున్నా, ఇప్పటికీ వచ్చి వెళ్ళాక ఒక రోజంతా ఆ బాధ ఉంటుంది.
ప్చ్, ఏమిటో మనని కన్నవాళ్ళని  వదల్లేక ఒకప్పుడు బాధ.మనం కన్నవాళ్ళని వదల్లేక ఇప్పుడు బాధ.
ప్రతివారికీ ఈ ఫేజ్ తప్పదు కదూ.ఎవరి జీవితాలు వాళ్ళవి.మనం ఎలా వదిలేసి వచ్చేసామో మన పిల్లలూ అంతే.
అందరూ అంటారు తనని చూస్తే లతను చూడక్కర్లేదు అని. అంత జిరాక్స్ కాపీ అన్నమాట నాకు
వావ్,పిల్లలు మన కళ్ళ ముందే ఎంత ఎదిగిపోతారో కదా అనిపిస్తుంది. దేనికైనా తన సలహా అడుగుతాను నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలను  హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని.
ఎన్ని కబుర్లు చెప్తాడో .
మే బీ ప్రతి తల్లి ఇలాగే ఫీల్ అవుతుందేమో తన బిడ్డని తలచుకుని.నా మనసులోని అనుభూతిని  రాయాలని అనిపించింది.
ఎక్కడ పుట్టి పెరుగుతుందో తెలియదు తన మనసు అర్ధం చేసుకుని,తోడవ్వగల ఓ బంగారుతల్లి  తన జీవితంలోకి రావాలని,నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా బాబుకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్నా



Monday, January 10, 2011

సంక్రాంతి ఊసులు





ముత్యాల ముగ్గుల్లో,ముద్దబంతి గొబ్బిళ్ళో 


అంటూ సంక్రాంతి ఎన్నో జ్ఞాపకాల సిరులను మోసుకొస్తుంది.ధనుర్మాసపు

వణికించే  చలికి మంచు దుప్పట్లు కప్పుకుంటూ,బంతి పూల  తోరణాలతో,

కళకళలాడే రంగవల్లులతో,చేతికొచ్చిన పంటల సిరులతో పల్లె లోగిళ్ళు

విలసిల్లుతాయి.



చిన్నప్పుడు సంక్రాంతి సెలవులకి ఎక్కువగా మా

పెద్దమ్మ గారి ఊరు వెళ్ళేవాళ్ళం.తనకి ఒక

పాప, బాబు.మేము ముగ్గురం చాలా క్లోజ్ గా

ఉండే వాళ్ళం.

పల్లెటూరు కదా చాలా పెద్ద వాకిలి ఉండేది రోజూ

చుక్కలు పెట్టి ముగ్గులు వెయ్యడం,కొత్తవి నేర్చుకోవడం సరదాగా

ఉండేది.అమ్మగారికీ  దండం పెట్టు,అయ్యగారికి దండం పెట్టు అంటూ

గంగిరెద్దుల మేళాలు,కీర్తనలు పాడుకుంటూ హరిదాసులూ సందడి చేసే

వారు.
 



                  
మధ్యలో పిండి కొట్టించి అరిసెలు వండడం ఒక

హడావుడి .చలిమిడి తింటూ నువ్వులు అద్దడమో, 

వండిన అరిసెలు ఆరపెట్టడమో ఏదో ఒకటి మా పిల్లల పని.

 
ఇక పండగ మూడు రోజులూ ఒకటే హడావుడి.

సాయంత్రమే కళ్లాపి చల్లి  వాకిలి రెడీ చేసే వారు.

చుక్కల ముగ్గులు కాకుండా ముగ్గు గొట్టాలతో

అమ్మ,పెద్దమ్మ వేస్తూ ఉంటే మేము అంచులు

కలపడం,మధ్యలో సున్నాలు చుట్టడం చేసే

వాళ్ళం.

అంతా అయ్యాక ఆ సున్నాలలో  పసుపు

కుంకుమలు,రేగుపళ్ళు,చెరకు,బెల్లం  ముక్కలు పెట్టేవాళ్ళం

ముగ్గుల మధ్యలో బంతి,కారబ్బంతి పూలు ఉంచి మురిసిపోయే వాళ్ళం.

సాయంత్రాలు యిట్టే గడిచి పోయేవి.



 ఇక పండగ నాడు తలంటు,కొత్త బట్టలు,గారెలు,

చక్రపొంగలి,ఆవడలు తప్పనిసరి. వీటన్నినిటిలో

ఆవడలు నా ఫేవరేట్ .రోట్లో వెన్నలా రుబ్బి వండిన

గారెలు, చిలికిన చిక్కని పెరుగులో నాని

నోట్లో వేసుకుంటే కరిగి పోయేవి.

ఒకసారి నేను అడిగానట. మళ్లీ సంక్రాంతి ఎప్పుడు అని.ఇంకా ఏడాది ఆగాలి,

ఎందుకమ్మా అన్నారు.సంక్రాంతి వస్తే  ఆవడలు తినొచ్చు కదా అన్నాను.

అయ్యో ఆవడలకి సంక్రాంతి దాక ఎందుకు అని ఎప్పుడైనా చేసుకోవచ్చు

అని అప్పటినుండీ ఎప్పుడు గారెలు వండినా నాకోసం ఆవడలు సిద్దం.


కనుమ నాడు మరో హడావుడి.కోళ్ళు కోసి ,పలావు  చేసేవారు.పెద్ద గిన్నె

కట్టెల పొయ్యి మీద పెట్టి,ఎక్కడో తెలుసుకున్న రెసిపీని జాగ్రత్తగా ఫాలో

అవుతూ  చేసి, పైన మూత మీద నిప్పులు పోసి,అడుగంటుతుందేమో అని

టెన్షన్ పడుతూ ఎలా అయితేనే పూర్తయ్యేది.నానా  హంగామా

అన్నమాట.ఇప్పుడు ఎంత ఈజీగా  బిర్యానీలు చేసేస్తున్నామో  కుక్కర్ లలో

అనిపిస్తుంది నాకు అది తలచుకుంటే.



ఇక ఈ సెలవుల్లో మధ్యాన్నాలు మా ఇష్టం.ఇంటికి 

వెనుక వైపు సిరిసింత చెట్లు ఉండేవి. వాటినే 

సీమచింతకాయలు అని కూడా అంటారు.కర్రకి 

కొక్కెం కట్టిఎర్రగా మగ్గిన కాయలు కోసుకుని 

తినేవాళ్ళం.

చింతపిక్కలు,వామన గుంటలు ఆటలు ఆడుకునే

వాళ్ళం.అన్నట్టు సెలవుల మధ్యలో పక్కనే ఉన్న 

టౌన్ లో ఒక సినిమా ట్రిప్ తప్పకుండా ఉండేది.


పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి దారి వారిది అయిపోయింది.పండగ పూట

ఆత్మీయులు అందర్నీఫోన్ లో పలకరించుకుంటాము.కాకపోతే ఒకరికొకరం

దూరంగా ఉంటున్నాము అంతే.ఇప్పుడూ కళ్లాపులు  లేకపోయినా

ముగ్గులూ,బంతిపూల తోరణాలు .పిండివంటలు,తోడుగా టీవీ చానెల్స్

అన్నీ ఉంటున్నాయి.


ఎప్పుడైనా  మా పిల్లలతో సహా  అలా ఓ సంక్రాంతి పూట అంతా కలిసి

గడపాలని చిన్న కోరిక,ఆశ.ఎప్పుడు తీరుతుందో కాలమే చెప్పాలి.

Sunday, January 2, 2011

ఎన్నెన్ని ఇష్టాలో


              కొత్త సంవత్సరం లో, కాదు కాదు  కొత్త దశాబ్దం లో  మొదటి రోజు

అయిపోయింది.రెండో రోజూ అయిపోతోంది.అదే జీవితం,అవే పనులు అదే

రొటీన్. కానీ జనవరి ఫస్ట్ అనగానే ఏదో హడావుడి,సంతోషం ,కాస్త ఆశ,

వీటన్నింటి  మధ్య ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు.

         ఇన్నేళ్ళ  తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే , జ్ఞాపకాల పొరలు

విప్పుకుంటూ ఎన్నో గుర్తొస్తున్నాయి. ఒకప్పటి కలలూ,కోరికలూ, ఆశలూ

అన్నీ.

నాకే కాదు ఎవరికైనా మనసొకటే. స్పందన ఒకటే. ప్రతి ఒక్కరికీ వాళ్లకి

మాత్రమే సొంతమైన ఇష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కదూ. 

పిండారబోసినట్టు విరబూసిన వెన్నెల్లో, కొబ్బరాకుల కింద కూర్చుని పాటలు

వింటూ,మనసుకు నచ్చిన పుస్తకం చదువుకోవడం ఇష్టం. అందాలు చిందే 

గులాబీలు,చిట్టి చిట్టి చేమంతులూ, విరబూసే మందారాలూ, పరిమళాలు

విరజిమ్మే మల్లెలూ వీటిని పెంచడం ఎంతో ఇష్టం.వాకిట్లో చుక్కలు పెట్టి

అందమైన ముగ్గులు వెయ్యడం ఇష్టం.ఓ వెన్నెల రాత్రి సముద్రపు ఒడ్డున

కూర్చుని కెరటాల హోరుని వినడం ఇష్టం.ఏ దూర ప్రాంతానికో వెళ్లి ప్రకృతిలో

మమేకమై పోవడం ఇంకా ఇష్టం. మనసుకి దగ్గరైన స్నేహితులతో, గంటల

తరబడి కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. 

మా ఫ్రెండ్ అంటుంది మనం ఎక్కువ ఏమీ ఆశించలేదు, ప్రశాంతమైన

జీవితం కోరుకున్నాం.కానీ చిత్రం ఏమిటంటే అదే మనకి దొరకలేదు అని.

               ఇన్నేళ్ళ జీవిత పయనంలో ఇవన్నీ ఏ చాటుకు వెళ్లిపోయాయో

తల్చుకుంటే  ఆశ్చర్యం వేస్తోంది.నిశ్శబ్దంగా పరుగులు తీసే కాలం బంధాల

బాధ్యతల మధ్యకి నన్ను నెట్టేసి, కమ్మేసిందేమో.

Saturday, December 18, 2010

అలరించే అద్భుతమైన రుచులు

ఎన్ని రకాల కూరలున్నా, ఎన్ని వెరైటీ వంటకాలున్నా, అన్నింటినీ తలదన్ని ఎవర్  గ్రీన్ గా కొన్ని రుచులు ఉంటాయి.ఎన్నిసార్లు తిన్నా, ఎప్పుడు తిన్నా, ఎన్ని సంవత్సరాలైనా బోర్ కొట్టదు సరి కదా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది కూడా. అవేమిటో ఇప్పుడు చూద్దాం.


శనగపప్పు కారం:  

వేయించిన శనగపప్పు,ఎండుమిర్చి,ఎండుకొబ్బరి  ఎట్స్ ట్రా  కలిపి కొట్టుకునే ఈ కారప్పొడి  వేడివేడి ఇడ్లీల్లో అయినా, వేడి అన్నంలో వేసుకుని 
తిన్నా కమ్మని రుచితో   నోరూరిస్తుంది 

మీరు కొబ్బరి పచ్చడి చెయ్యండి, పల్లీ పచ్చడి చెయ్యండి, దేనితో తిన్నా చివరలో కారప్పొడీ, నెయ్యీ వేసుకుని మరో రెండు ఇడ్లీలు లాగించనిదే అసలు ఇడ్లీ  తిన్నట్టే ఉండదు అని ఫీల్ అయిపోయే వారు చాలామందే ఉంటారు.


కరివేపాకు కారం(నల్లకారం): 

ఘుమఘుమలాడే కరివేపాకు, ఎండుమిర్చి,ధనియాలు, వెల్లుల్లి  మరిన్ని వేసి తయారు చేసుకునే ఈ కారం వేడి అన్నం లో కరిగిన నెయ్యితో ఆహా అనిపిస్తుంది.



గోంగూర పచ్చడి: దీని గురించి నేను చెప్పేది ఏముంది అండీ.ఆంద్ర మాత గా స్థిరపడిపోయింది కదా. ఎండుమిర్చితో చేసినా ,పచ్చిమిర్చి తో చేసినా ఈ పచ్చడిని తలచుకోని వారు,ఆస్వాదించని వారు  ఉండరు.




ఆవకాయ:  మల్లెపువ్వు లాంటి తెల్లని అన్నంలో,ఎర్రని, ఎర్రెర్రని ఆవకాయ, ముద్దపప్పు,  నెయ్యి  అబ్బ, నోరూరిపోతోంది  కదూ

పైవి ఏవైనా ఉండవేమో కానీ ఆవకాయ లేని తెలుగిల్లు ఉండదు.

చివరగా 


కాకరకాయ కారం: ఇది ఎంతమంది ఇష్టం గా తింటారో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు  అమ్మ చేస్తే నేను చాలా ఇష్టపడేదాన్ని

కాకరకాయలు చక్రాల్లా కోసి,మజ్జిగ లో ఉడకపెట్టి,నూనె లో ఫ్రై చేసి,జీలకర్ర, వెల్లుల్లి,పచ్చి కారం  కలిపి నూరిన ముద్డ వేసి వేయిస్తే దాదాపు నెల రోజులు నిలువ ఉండేది.చాలా స్పైసీ గా ఉండేది.

ఇలా రాసుకుంటూ పోతే ఇంకా కందిపొడి, కందిపచ్చడి ఈ లిస్టు కి అంతం ఉండదేమో.

ఇన్ని చెప్పిన తరువాత మీకో విషయం చెప్పాలి.నా చిన్నప్పుడు మా దూరపు బంధువులావిడ ఉండేది.ఆవిడ ప్రసక్తి ఎప్పుడు వచ్చినా ఇది తప్పకుండా చెప్పుకునేవారు. వాళ్ళ ఇంట్లో పై నాలుగు వెరైటీలు, నాలుగు సీసాల్లో టేబుల్ మీద ఉండేవట.ఆవకాయ ఎటూ ఉంటుంది కదా. వీటిలో ఏసీసా ఖాళీ అయితే అది వెంటనే చేసి నింపేసేవారట ఆవిడ. పల్లెటూరు కదా  స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి సరే సరి.

ఇంట్లో  ఎప్పుడు ఎగ్స్ రెడీగా ఉండేవి. సో, ఏ వేళ కాని వేళ, అర్ధరాత్రి,అపరాత్రి  ఏ టైం లోఅతిధులు  వచ్చినా రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసి ఈ వెరైటీలు, కమ్మని నేతితో భోజనం పెట్టేవారట.ఇంకా కూరలతో పని ఏముంది చెప్పండి.

సడెన్ గా ఈ తిండి గోల ఏమిటి అనుకోకండి.ఉదయం శనగపప్పు కారం చేశాను.అది చేస్తుంటే ఈ ఆలోచనలు వచ్చాయి.అక్షర రూపం ఇస్తే ఇదిగో  ఇలా ఈ పోస్ట్ అయ్యింది. 

అదన్నమాట సంగతి.







Thursday, November 11, 2010

కార్తీకపౌర్ణమి

కార్తీక పౌర్ణమి  అనగానే మనసు చిన్నతనం లోకి పరుగులు తీస్తుంది .వెన్నెల లాంటి జ్ఞాపకం అలలా పలకరిస్తుంది .
ఎందుకో తెలియదు కార్తీకపౌర్ణమి అంటే చాల ఇష్టం నాకు.చిన్నప్పుడు ఉపవాసం ఉండడం కూడా సరదాగా ఉండేది.పగలంతా కష్టపడి (ఏమి తినకుండా ఉండడానికి) ఉపవాసం ఉండి 5 గంటలకే శివాలయానికి వెళ్లి ముగ్గు వేసి ,అందులో బాదం ఆకులమీద ప్రమిదలు పెట్టి 365 వత్తులు కట్టగా కట్టి నానబెట్టినవి వెలిగించి ఇంటికి వచ్చేవాళ్ళం. 
ఒక అప్పటినుండి చంద్రుడు కోసం ఎదురు చూపులు అన్నమాట.మరి ఆయన వస్తేనే కదా భోజనం.


పున్నమిచంద్రుడు 
మాకు పెద్ద ఓపెన్ వరండా ఉండేది .పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో పీట వేసి దేవుణ్ణి పెట్టి పూజ చేసి తరువాత అక్కడే భోజనం చేసేవాళ్ళం.
చిట్టి గారెలు,పులిహోర,నేతిబీరకాయ పచ్చడి,పాయసం తప్పనిసరిగా  ఉండేవి.అసలే ఆకలి దంచేసేదేమో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అమృతంలా ఉండేది.
ఈ తరం పిల్లలకి ఆ ఆవకాశం లేదేమో .ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో చంద్రుడు కనపడడమే గొప్ప .ఇంకా వెన్నెల్లో భోజనం కూడానా ,ప్చ్ .

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008